Stock market: ఇంట్రాడే గరిష్ఠం నుంచి 400 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్

Play all audios:

ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం నష్టాలతో ముగిశాయి. ఉదయం సానుకూలంగా ట్రేడింగ్ ప్రారంభించిన మార్కెట్లు కాసేపటికే నష్టాల్లోకి జారుకున్నాయి. సెన్సెక్స్ ఇంట్రాడే గరిష్ఠం నుంచి ఓ
దశలో 400 పాయింట్లకు పైగా కుంగింది. అమెరికా, యూకే స్టాక్స్ ఫ్యూచర్స్ నష్టాల్లోకి జారుకోవడం మార్కెట్ల సెంటిమెంటును దెబ్బతీసింది. యూఎస్లో మధ్యంతర ఎన్నికల ఫలితాలు అధికార పార్టీకి ప్రతికూలంగా
ఉండడమే దీనికి కారణం. దేశీయంగా విదేశీ మదుపర్ల బలమైన కొనుగోళ్లు, రూపాయి పుంజుకోవడం వంటి సానుకూల సంకేతాలు ఉన్నప్పటికీ.. అంతర్జాతీయ పరిణామాలు మార్కెట్లను కలవరపెట్టాయి. ఉదయం సెన్సెక్స్ 61,304.29
వద్ద లాభాలతో ప్రారంభమైంది. ఇంట్రాడేలో 61,447.23 - 60,905.15 మధ్య కదలాడింది. చివరకు 151.60 పాయింట్లు నష్టపోయి 61,033.55 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 45.80 నష్టంతో 18,157.00 వద్ద ముగిసింది.
డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.81.42 వద్ద నిలిచింది. సెన్సెక్స్30 సూచీలో 6 షేర్లు లాభపడ్డాయి. ఐటీసీ, డాక్టర్ రెడ్డీస్, ఇండస్ఇండ్ బ్యాంక్, హెచ్సీఎల్ టెక్, కొటాక్ మహీంద్రా
బ్యాంక్, ఇన్ఫోసిస్ షేర్లు లాభాలతో ముగిశాయి. పవర్గ్రిడ్, టెక్ మహీంద్రా, సన్ఫార్మా, హెచ్యూఎల్, ఎన్టీపీసీ, ఎంఅండ్ఎం, బజాజ్ ఫిన్సర్వ్, అల్ట్రాటెక్ సిమెంట్స్, ఎల్అండ్టీ, టైటన్,
ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లు నష్టపోయాయి. మార్కెట్లోని మరిన్ని విశేషాలు.. * సెప్టెంబరుతో ముగిసిన రెండో త్రైమాసికంలో సియెట్ ఆకర్షణీయ ఫలితాలను ప్రకటించింది. దీంతో కంపెనీ షేరు 5.46 శాతం లాభపడి
రూ.1705 వద్ద స్థిరపడింది. * 5:1 బోనస్ షేర్ల జారీకి రికార్డు తేదీ దగ్గరపడుతుండడంతో నైకా షేరు ధర మరింత పతనమైంది. ఈరోజు 8.13 శాతం నష్టంతో రూ.1040.10 వద్ద ముగిసింది.