Ghulam nabi azad: పాక్ ఉగ్రవాదుల పుట్ట.. ప్రపంచంలో మరెక్కడా అంత మంది లేరు: గులాం నబీ ఆజాద్

Play all audios:

ప్రపంచం మొత్తంతో పోల్చితే పాకిస్థాన్లోనే అత్యధిక ఉగ్రవాదులు ఉన్నారని జమ్మూకశ్మీర్ మాజీ సీఎం గులాం నబీ ఆజాద్ విమర్శించారు. ఇంటర్నెట్డెస్క్: ఉగ్రవాదంతో అంటకాగుతూ మన దేశంపై విషం
చిమ్ముతున్న పాకిస్థాన్ను ఎండగట్టేందుకు వివిధ పార్టీల ఎంపీల నాయకత్వంలోని బృందాలు ప్రపంచదేశాలకు వెళ్లాయి. భాజపా నేత బైజయంత్ పాండా నేతృత్వంలోని బృందం బహ్రెయిన్ (Bahrain)లో పర్యటిస్తోంది.
ఇందులో భాగంగా బృంద సభ్యుల్లో ఒకరైన జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి గులాం నబీ ఆజాద్ (Ghulam Nabi Azad) మాట్లాడుతూ.. ప్రపంచం మొత్తంతో పోల్చితే పాకిస్థాన్లోనే అత్యధిక సంఖ్యలో ఉగ్రవాదులున్నారని
విమర్శించారు. బహ్రెయిన్ వివిధ మతాల సమ్మేళనమని, ప్రజల్లో ఎటువంటి విభేదాలు లేవని అన్నారు. ఇది ఓ మినీ ఇండియాలా కనిపిస్తోందని వ్యాఖ్యానించారు. అఖిల పక్ష బృందంలో ఉన్న తామంతా వేర్వేరు పార్టీలకు
చెందినవారిమైనా.. ఐక్యంగా ప్రపంచ దేశాల ముందుకు వచ్చామన్నారు. కానీ, పాక్ మతపరమైన భావజాలంతో ఏర్పడిన దేశమని.. అయినా కూడా అక్కడి వారిలో ఐక్యత లోపించిందని విమర్శలు గుప్పించారు. పాకిస్థాన్తో సహా
ప్రపంచ దేశాలతో సత్సంబంధాలు కొనసాగించడానికి భారత ప్రధాని నరేంద్ర మోదీ కృషి చేస్తున్నారని అన్నారు. పాక్ అధినేతలతో శాంతి చర్చలు జరపడానికి అనేకసార్లు ప్రయత్నించారని పేర్కొన్నారు. ఆపరేషన్
సిందూర్ (Operation Sindoor) పై అక్కడి నేతలకు వివరిస్తూ.. ఆపరేషన్ సిందూర్లో భారత్ కేవలం ఉగ్రస్థావరాలే లక్ష్యంగా దాడులు చేసిందని.. సాధరణ ప్రజలకు ఎటువంటి నష్టం కలిగించలేదన్నారు. అయినప్పటికీ
దాయాది దేశం భారత సరిహద్దు ప్రాంతాల్లోని పౌరులపై దాడులకు పాల్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. * భారత్ శక్తిమంతమైన సైనిక దేశంగా రూపొందాలి పహల్గాం దాడికి ప్రతీకారంగా భారత్ ‘ఆపరేషన్ సిందూర్’
రూపంలో ఉగ్రస్థావరాలపై విరుచుకుపడింది. పీఓకే, పాక్లోని ఉగ్ర శిబిరాలను ధ్వంసం చేసింది. తర్వాత పాక్ రెచ్చగొట్టే చర్యలను మన బలగాలు తిప్పికొట్టాయి. ఈనేపథ్యంలోనే కేంద్రం దౌత్య యుద్ధాన్ని
ప్రారంభించింది. అందులో భాగంగా భారత్ ఉగ్రవాదులపై జరిపిన దాడుల గురించి ప్రపంచ దేశాలకు వివరించడానికి ప్రతినిధి బృందాలను విదేశాలకు పంపింది.