Operation sindoor: ఉగ్రవాద వ్యాప్తికి సహకరించే వారికి సరైన సమాధానం ‘ఆపరేషన్ సిందూర్’: మోదీ

Play all audios:

Operation Sindoor | ఇంటర్నెట్డెస్క్: భారత్లో ఉగ్రవాదం వ్యాప్తి చేసేవారికి సరైన సమాధానం ఆపరేషన్ సిందూర్ అని ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు. గురువారం ఆయన సిక్కిం రాష్ట్ర హోదా పొంది 50
సంవత్సరాలు పూర్తైన సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో వర్చువల్గా పాల్గొని ప్రసంగించారు. ఉగ్రవాదంపై పోరాడేందుకు దేశం మొత్తం ఏకమైందని ఆయన పేర్కొన్నారు. హిమాలయ రాష్ట్రమైన సిక్కిం దేశానికి
గర్వకారణమన్నారు. ఇక్కడి ప్రజలు ప్రజాస్వామ్యాన్ని విశ్వసిస్తారని పేర్కొన్నారు. ‘‘గత నెలలో పహల్గాం దాడికి ప్రతీకారంగా చేపట్టిన ఆపరేషన్ సిందూర్.. ఉగ్రవాదం వ్యాప్తి చేసేవారికి సరైన సమాధానం.
పహల్గాంలో ఉగ్రమూక చేసింది మానవత్వంపై దాడి. ఇప్పుడు మనం టెర్రరిజానికి వ్యతిరేకంగా పోరాడేందుకు ఏకమయ్యాం. నేను గ్యాంగ్టక్లో జరుగుతున్న కార్యక్రమంలో పాల్గొందామని ఆశించాను. కానీ, వాతావరణం
అందుకు సహకరించలేదు. సాహస క్రీడలకు హబ్గా మారే అవకాశాలు సిక్కింకు పుష్కలంగా ఉన్నాయి. మిగిలిన ఈశాన్య రాష్ట్రాలు కూడా ఇదే బాటలో నడవాలి’’ అని ప్రధాని వ్యాఖ్యానించారు. వాస్తవానికి ప్రధాని మోదీ
గ్యాంగ్టక్ను సందర్శించాల్సి ఉంది. కానీ, వాతావరణం అనుకూలించకపోవడంతో.. ఆయన పర్యటన రద్దు చేసుకొన్నారు. కానీ, పల్జోర్ స్టేడియంలో జరుగుతున్న కార్యక్రమంలో పాల్గొన్న వారిని ఉద్దేశించి
పశ్చిమబెంగాల్లోని బగ్డోగ్రా నుంచి వర్చ్యూవల్ విధానంలో ప్రసంగించారు. సిక్కింలో ఆర్గానిక్ ఎగుమతులు పెరగడం చాలా పెద్ద విజయమని ప్రధాని అభివర్ణించారు. రాష్ట్రంలో కనెక్టివిటీని పెంచడంపై
కేంద్రం దృష్టిపెట్టిందన్నారు. సేవక్-రంగ్పో ప్రాజెక్టుతో రాష్ట్రాన్ని దేశంలో మిగిలిన రైల్వే నెట్వర్క్కు అనుసంధానిస్తుందని చెప్పారు. సుసంపన్న జీవవైవిధ్యంతో పర్యావరణ పరిరక్షణలో సిక్కిం ఓ
ఉదాహరణగా నిలిచిందని అభినందించారు. ఈసందర్భంగా ప్రధాని మోదీ నామ్ఛీలోని 500 పడకల ఆస్పత్రి, సాంగచోలింగ్లోని రోప్వే, గ్యాంగ్టక్లోని శాంగ్ఖోలాలో మాజీ ప్రధాని వాజ్పేయి విగ్రహానికి శంకుస్థాపన
చేశారు.