Ipl 2025: సరైన ఓపెనింగ్‌ జోడీ లేకపోవడం వల్లే దిల్లీ ప్లేఆఫ్స్‌నకు చేరుకోలేకపోయింది: హేమంగ్‌ బదానీ

Ipl 2025: సరైన ఓపెనింగ్‌ జోడీ లేకపోవడం వల్లే దిల్లీ ప్లేఆఫ్స్‌నకు చేరుకోలేకపోయింది: హేమంగ్‌ బదానీ

Play all audios:


ఇంటర్నెట్‌ డెస్క్‌: ఐపీఎల్‌ (IPL) 2025 సీజన్‌లో భాగంగా బుధవారం ముంబయి ఇండియన్స్‌ (Mumbai Indians), దిల్లీ క్యాపిటల్స్‌ (Delhi Capitals) మధ్య మ్యాచ్‌ జరిగింది. ఇందులో 59 పరుగుల తేడాతో దిల్లీ


ఓటమి పాలైంది. కీలక పోరులో ఈ పరాజయంతో దిల్లీ ప్లేఆఫ్స్‌ రేసు నుంచి కూడా నిష్క్రమించింది. ఈ నేపథ్యంలో దిల్లీ క్యాపిటల్స్‌ ప్లేఆఫ్స్‌నకు చేరుకోకపోవడానికి గల కారణాల గురించి ఆ జట్టు ప్రధాన కోచ్‌


హేమంగ్‌ బదానీ మాట్లాడారు.  ‘ఈ ఐపీఎల్‌ సీజన్‌లో సరైన ఓపెనింగ్‌ జోడీని మేం కనుగొనలేకపోయాం. మా జట్టులో జేక్‌ ప్రేజర్‌ మెక్‌ గుర్క్‌, అభిషేక్‌ పోరెల్‌, ఫాఫ్‌ డుప్లెసిస్‌, కరుణ్‌నాయర్‌ ఉన్నారు.


కానీ వీరు నిలకడగా రాణించలేదు. ఇతర జట్లకు దక్కిన శుభారంభాలు, గొప్ప పవర్‌ప్లేలు మాకు లభించలేదు. అందుకే మేం ఈ రేసులో వెనకబడి ఉన్నాం. కేఎల్‌ రాహుల్‌ (KL Rahul) ఒక్కడే మా టీమ్‌ తరఫున అద్భుత


ప్రదర్శనలు చేశాడు. ఇప్పటి వరకు అతడు ఆడిన 13 మ్యాచుల్లో 504 పరుగులు రాబట్టాడు’ అని బదానీ విశ్లేషించాడు.  సీజన్‌ ప్రారంభంలో దిల్లీ కొన్ని వరుస విజయాలు సాధించింది. కానీ తర్వాత వెనుకబడింది. ఈ


విషయాన్ని కూడా దిల్లీ కోచ్‌ ప్రస్తావించాడు. ‘మేం ఈ ఐపీఎల్‌ సీజన్‌ మొదట్లో చక్కటి ప్రదర్శనలే చేశాం. మొదటి ఆరు మ్యాచుల్లో, అయిదు గెలిచాం. తర్వాత పరిస్థితులు మాకు ప్రతికూలంగా మారాయి. కొన్ని


మ్యాచుల్లో విజయం ముంగిట బోల్తా పడ్డాం. కోల్‌కతా నైట్‌ రైడర్స్‌తో (Kolkata Knight Riders) జరిగిన మ్యాచ్‌లో అయితే మేం ఆరు ఓవర్లలో 60 పరుగులు సాధించాల్సి వచ్చింది. అప్పుడు మా చేతిలో ఏడు


వికెట్లు ఉన్నాయి. అయినా ఆ మ్యాచ్‌ను మేం గెలవలేకపోయాం. ఇలా పరాజయాల పరంపర కొనసాగితే ప్లేఆఫ్స్‌నకు చేరుకోవడం ఏ జట్టుకైనా కష్టమే అవుతుంది’ అని దిల్లీ కోచ్‌ హేమంగ్‌ బదానీ పేర్కొన్నాడు.