Iran: మాకు ఎవరి అనుమతి అక్కర్లేదు.. అణు కార్యక్రమాలపై ఇరాన్ సుప్రీం లీడర్

Play all audios:

తాము నిర్వహించే అణు కార్యక్రమాలకు సంబంధించి ఎవరి అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదని ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా కమేనీ పేర్కొన్నారు. ఇంటర్నెట్డెస్క్: ఇరాన్ (Iran) అణు కార్యక్రమాలపై
అమెరికా (USA) అభ్యంతరాలు తెలుపుతున్న సంగతి తెలిసిందే. దీనిపై తాజాగా ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ (Ayatollah Ali Khamenei) స్పందించారు. యురేనియం శుద్ధిపై అమెరికా పరిమితులు
విధించడాన్ని తోసిపుచ్చిన ఆయన.. తమకు ఎవరి అనుమతి అవసరం లేదని వ్యాఖ్యానించారు. గతేడాది హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందిన ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ (Ebrahim Raisi) స్మారక కార్యక్రమంలో
ఖమేనీ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘ఇరాన్ యురేనియం శుద్ధి అపరిమితంగా తయారుచేయడానికి మేము అనుమతించమని వారు (అమెరికాను ఉద్దేశిస్తూ) అంటున్నారు. ఇది పూర్తిగా అర్థం లేనిది. ఒకరి అనుమతి కోసం
వేచి చూడాల్సిన అవసరం ఇరాన్కు లేదు. మా సొంత విధానాలు మాకు ఉన్నాయి. వాటికి కట్టుబడి ఉంటాం. ప్రస్తుత తరహాలోనే రైసీ హయాంలో కూడా పరోక్ష చర్చలు జరిగాయి. అయితే వాటిల్లో ఎలాంటి ముందడుగు పడలేదు.
ప్రస్తుత చర్చల నుంచి కూడా మేము ఎక్కువగా ఆశించడం లేదు. ఏం జరుగుతుందో ఎవరికి తెలుసు’ అని ఖమేనీ పేర్కొన్నారు. * ఇరాన్ అణుకేంద్రాలపై దాడికి ఇజ్రాయెల్ ప్రణాళిక: అమెరికా ఇంటెలిజెన్స్ ఇరాన్
అణ్వాయుధాలను అభివృద్ధి చేసుకోకుండా నిలువరించేందుకు అమెరికా ప్రయత్నాలు చేస్తోంది. ఈక్రమంలోనే మరోసారి అణుఒప్పందం (Nuclear Deal) కుదుర్చుకోవడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald
Trump) సంసిద్ధత వ్యక్తంచేశారు. అందులోభాగంగా ఇరాన్, అమెరికాకు చెందిన అధికారుల మధ్య ఇటీవల పలు విడతల్లో చర్చలు జరిగాయి. మూడో విడత చర్చల్లో యురేనియం శుద్ధి అంశమే ప్రధానంగా చర్చించారు. పౌర
అవసరాలకు మాత్రమే అణుశుద్ధి కార్యక్రమాన్ని టెహ్రాన్ పరిమితం చేయాలని వాషింగ్టన్ పట్టుబడుతోంది. అణ్వాయుధాలు తయారుచేసే స్థాయిలో ఉండకూడదంటోంది. దీనిపైనే తాజాగా ఖమేనీ స్పందించారు. ఇక, తదుపరి
చర్చలు ఎప్పుడు జరుగుతాయనే దానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని ఇరాన్ విదేశాంగ మంత్రిత్వశాఖ ప్రతినిధి ఎస్మాయిల్ బఘై ఓ వార్తా సంస్థతో తెలిపారు.