India -pakistan: పాక్ ఆర్థిక వ్యవస్థపై దెబ్బకొట్టేందుకు భారత్ ప్రయత్నాలు

Play all audios:

ఇంటర్నెట్డెస్క్: పహల్గాం ఉగ్రదాడి (Pahalgam terror attack) తర్వాత ఆవేదనతో రగిలిపోయిన భారత్.. ‘ఆపరేషన్ సిందూర్’ (Operation Sindoor) పేరుతో పాక్ లోని ఉగ్ర స్థావరాలను నేలమట్టం చేసింది.
ఉగ్ర నాగులకు ఆశ్రయం కల్పిస్తున్న పాక్ పైనా చర్యలకు ఉపక్రమించింది. సింధు నది జలాల ఒప్పందం అమలును తాత్కాలికంగా నిలిపివేసింది. అఖిలపక్ష సభ్యులతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి, దాయాది చర్యలను
తూర్పారబడుతూ.. దౌత్య మార్గాల్లోనూ ఒత్తిడి తీసుకొస్తోంది. ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తే ఎలాంటి చర్యలకైనా వెనకాడబోమని పాకిస్థాన్కు పరోక్షంగా హెచ్చరికలు పంపుతోంది. ఈ క్రమంలోనే పాక్ ఆర్థిక
మార్గాలను మూసివేసి, ఆ దేశ ఆర్థిక వ్యవస్థపైనా దెబ్బ కొట్టేందుకు భారత్ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఈ క్రమంలోనే దాయాదికి ఆర్థిక సాయం అందించే ప్రపంచ బ్యాంక్, ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్
ఫోర్స్ (ఎన్ఏటీఎఫ్)లను కలవాలని భారత్ యోచిస్తోంది. ప్రపంచ బ్యాంక్ 2 బిలియన్ డాలర్ల ఆర్థికసాయం చేస్తుందని పాక్ ఎన్నో ఆశలు పెట్టుకుంది. జూన్ నెలలో వరల్డ్ బ్యాంక్ దీనిపై ఓ నిర్ణయం
తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈనేపథ్యంలో పహల్గాం దాడిని ఉటంకిస్తూ.. ప్యాకేజీపై పునరాలోచించాలని ప్రపంచ బ్యాంక్కు విజ్ఞప్తి చేసేందుకు భారత్ సిద్ధమవుతోంది. ఉగ్రవాదాన్ని
ప్రోత్సహిస్తోందన్న కారణంతో 2018 జూన్లో పాకిస్థాన్ను ‘గ్రే జాబితా’లో చేర్చారు. దీంతో ప్రపంచ ఆర్థికసంస్థల నుంచి నిధులు మంజూరయ్యేవి కాదు. అయితే, ఉగ్రవాదం అణచివేతకు కృషి చేస్తామని హామీ ఇవ్వడమే
కాకుండా.. ఉగ్రవాద సంస్థతో సంబంధం ఉన్న కొందరిని జైళ్లలో పెట్టడంతో.. 2022 అక్టోబర్లో పాక్ను ఆ జాబితా నుంచి తొలగించారు. తాజా పరిస్థితుల నేపథ్యంలో పాక్ను మళ్లీ గ్రే జాబితాలో చేర్చాలని
ఎఫ్ఏటీఎఫ్పై భారత్ తీవ్రంగా ఒత్తిడి తీసుకొస్తోంది. ఒకవేళ పాక్ను మళ్లీ ఆ జాబితాలో చేరిస్తే.. ప్రపంచ బ్యాంకు నుంచి రావాల్సిన 2 బిలియన్ డాలర్ల ప్యాకేజీ ఆగిపోయే అవకాశం ఉంది. మరోవైపు
ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ (ఐఎమ్ఎఫ్) సంస్థ పాకిస్థాన్కు మే 9న 1 బిలియన్ డాలర్లు (సుమారు రూ.8,500 కోట్లు) ఆర్థికసాయం మంజూరు చేసింది. దీనిపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేసింది.