Shreyas iyer: పంజాబ్ కింగ్స్ కెప్టెన్.. శ్రేయస్ అయ్యర్ రికార్డు సృష్టిస్తాడా?

Play all audios:

ఐపీఎల్లో మూడు వేరువేరు జట్లను ఫైనల్కు తీసుకెళ్లిన కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్ ఇప్పటికే రికార్డ్ సృష్టించాడు. ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ (IPL) ప్రారంభంలో పంజాబ్ కింగ్స్ (Punjab Kings)
మీద పెద్దగా అంచనాల్లేవు. కారణం.. అది ఇంత వరకు ఒక్కసారి కూడా కప్పు కొట్టలేకపోవడం! ఆ జట్టు చివరిసారిగా 2014లో ప్లేఆఫ్స్ ఆడింది. అప్పుడు ఫైనల్స్లో కోల్కతా నైట్రైడర్స్ (Kolkata Knight
Riders) చేతిలో ఓటమి పాలైంది. మళ్లీ అనూహ్యంగా 11 సంవత్సరాల తర్వాత శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో ఫైనల్కు చేరుకుంది. పంజాబ్ సేన ప్రస్తుతం ట్రోఫీకి అడుగు దూరంలో ఉంది. గత సీజన్లోనూ...
శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో గత సీజన్లో కోల్కతా నైట్రైడర్స్ ఐపీఎల్ ట్రోఫీని కైవసం చేసుకుంది. 2024 సీజన్ మొత్తం భీకర ఫామ్లో ఉన్న సన్రైజర్స్ హైదరాబాద్ మీద (Sunrisers Hyderabad) 8
వికెట్ల తేడాతో కోల్కతా నైట్ రైడర్స్ గెలిచింది. బరిలో దిగితే 200 పరుగులు గ్యారంటీ అన్నట్లుగా మిగతా అన్ని మ్యాచుల్లో హైదరాబాద్ జట్టు బ్యాటింగ్ చేసింది. అలాంటి టీమ్ను ఫైనల్లో కేవలం 113
పరుగులకే (18.3 ఓవర్లు) పరిమితం చేయడంలో కెప్టెన్గా శ్రేయస్ వ్యూహాలు ఫలించాయి. తర్వాత ఛేదనకు దిగిన కోల్కతా నైట్రైడర్స్ 10.3 ఓవర్లలో కేవలం 2 వికెట్లు నష్టపోయి 114 పరుగులు చేసి ఐపీఎల్
ట్రోఫీని కైవసం చేసుకుంది. అంతా సన్రైజర్స్దే టైటిల్ అనుకుంటున్న వేళ, అందరికీ షాక్ ఇస్తూ కోల్కతా నైట్ రైడర్స్ను శ్రేయస్ అయ్యర్ విజేతగా నిలిపాడు. కానీ అనూహ్యంగా 2025 మెగా వేలంలో
కోల్కతా.. శ్రేయస్ను రిటైన్ చేసుకోకుండా వదిలేసుకుంది. ఇదే అద్భుత అవకాశంగా పంజాబ్ కింగ్స్ శ్రేయస్ను 26.75 కోట్ల భారీ మొత్తాన్ని వెచ్చించి సొంతం చేసుకుంది. దిల్లీ క్యాపిటల్స్ను కూడా...
అంతకు ముందు 2020లో శ్రేయస్ దిల్లీ క్యాపిటల్స్కు (Delhi Capitals) కెప్టెన్గా వ్యవహరిస్తూ ఫైనల్కు తీసుకెళ్లాడు. అప్పుడు ముంబయి (Mumbai Indians) చేతిలో దిల్లీ క్యాపిటల్స్ అయిదు వికెట్ల
తేడాతో ఓడిపోయింది. అప్పుడు తొలుత బ్యాటింగ్ చేసిన దిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లకు 7 వికెట్లు నష్టపోయి 156 పరుగులు చేసింది. ఛేజింగ్లో ముంబయి ఇండియన్స్ 18.4 ఓవర్లకు 5 వికెట్లు
కోల్పోయి 157 రన్స్ చేసింది. ఆశలు వమ్ము చేయకుండా.. పంజాబ్ కింగ్స్ తన మీద పెట్టుకున్న ఆశలు వమ్ము చేయకుండా శ్రేయస్ అయ్యర్ ఆ జట్టును ఏకంగా ఫైనల్కు తీసుకెళ్లాడు. మూడు వేరువేరు జట్లను
ఫైనల్కు తీసుకెళ్లిన కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్ రికార్డ్ సృష్టించాడు. ఈ సీజన్లో తుదిపోరులో ఆర్సీబీ మీద పంజాబ్ విజయం సాధిస్తే వరుసగా రెండు సీజన్లలో రెండు వేరు వేరు టీమ్లకు ఐపీఎల్
ట్రోఫీ అందించిన తొలి కెప్టెన్గానూ నిలిచే అవకాశం ఉంది. కానీ క్వాలిఫయర్ 1లో ఆర్సీబీ మీద ఓడిపోయి ఉండటం పంజాబ్కు కాస్త ప్రతికూలాంశం. అయినప్పటికీ క్వాలిఫయర్ 2లో ముంబయికి షాక్ ఇచ్చిన
పంజాబ్కింగ్స్ రెట్టించిన ఆత్మవిశ్వాసంతో ఫైనల్స్లోకి ప్రవేశించింది. మరి ఫైనల్లో ఎలా ఆడనుందో ఇంకొన్ని గంటల్లోనే తేలనుంది.