Usa-china: నిప్పుతో ఆడుకోవద్దు.. అమెరికాకు చైనా హెచ్చరికలు

Play all audios:

ఇండో-పసిఫిక్లో చైనా దూకుడు ప్రదర్శిస్తే అమెరికా దాన్ని అడ్డుకుంటుందంటూ ఆ దేశ రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ చేసిన వ్యాఖ్యలపై తాజాగా బీజింగ్ స్పందించింది. ఇంటర్నెట్డెస్క్: ఇండో-పసిఫిక్
(Indo-Pacific)లో చైనా దూకుడు ప్రదర్శిస్తే అమెరికా దాన్ని అడ్డుకుంటుందని ఆ దేశ రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ (Pete Hegseth) పేర్కొనడంపై చైనా (China) స్పందించింది. ఈ క్రమంలో యూఎస్కు గట్టి
హెచ్చరికలు చేసింది. తైవాన్ అంశాన్ని హెగ్సెత్ ప్రస్తావించడాన్ని చైనా విదేశాంగ మంత్రిత్వశాఖ తప్పుబట్టింది. చైనాను అదుపు చేసేందుకు తైవాన్ (Taiwan) సమస్యను అమెరికా తీసుకురావడం సరికాదని చైనా
విదేశాంగ మంత్రిత్వశాఖ ప్రతినిధి లిన్ జియాన్ (Lin Jian) పేర్కొన్నారు. నిప్పుతో ఆడుకోవద్దంటూ వాషింగ్టన్కు గట్టి హెచ్చరికలు చేశారు. తైవాన్ అంశం చైనా అంతర్గత వ్యవహారమని, దీనిలో మూడో దేశం
జోక్యం మానుకోవాలని వ్యాఖ్యానించారు. ఇండో పసిఫిక్లో మిత్రదేశాలను గాలికి వదిలేయం పీట్ హెగ్సెత్ సింగపూర్లో జరిగిన అంతర్జాతీయ భద్రతా సదస్సుల్లో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. భౌగోళిక,
సముద్ర వివాదాల పరిష్కారంతో పాటు తైవాన్ విషయంలో చైనా ఏకపక్షంగా వ్యవహరిస్తోందన్నారు. భవిష్యత్తులో ఆ దేశం నుంచి వచ్చే ముప్పును.. ముఖ్యంగా తైవాన్పై దాని దూకుడు ప్రదర్శనను ఎదుర్కోవడానికి యూఎస్
విదేశాల్లో తన రక్షణను బలోపేతం చేస్తోందన్నారు. తైవాన్ను స్వాధీనం చేసుకోవడానికి చైనా దాని చుట్టూ సముద్రజలాల్లో యుద్ధ విమాన వాహక నౌకలను మోహరిస్తూ బెదిరింపులకు పాల్పడుతోందని పేర్కొన్నారు.
లాటిన్ అమెరికాపైనా చైనా కన్నేసిందనీ.. పనామా కాలువపై తన ఆధిపత్యాన్ని పెంచుకునేందుకు కృషి చేస్తోందని చెప్పారు. చైనా నుంచి ఆర్థిక, సైనిక ఒత్తిళ్లను ఎదుర్కొంటున్న ఇండో పసిఫిక్ ప్రాంత
మిత్రదేశాలను గాలికి వదిలేయబోమని.. ఆయా దేశాలు తమ రక్షణ వ్యయాన్ని పెంచుకోవాలని హెగ్సెత్ సూచించారు.