Donald trump: ఉద్రిక్తతలు తగ్గాలంటే భారత్-పాకిస్థాన్ కలిసి డిన్నర్ చేయాలి.. ట్రంప్ నోట మళ్లీ అదే పాట

Play all audios:

ఇంటర్నెట్ డెస్క్: భారత్-పాకిస్థాన్ల మధ్య కాల్పుల విరమణ ఒప్పందానికి తానే కారణమంటూ పేర్కొంటున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) మరోసారి అదే పాట పాడారు. ఉద్రిక్తతలు
తగ్గించుకోవడానికి ఇరుదేశాలు కలిసి మంచి డిన్నర్ ఏర్పాటుచేసుకోవాలని తాజాగా సూచించారు. అణుక్షిపణులతో యుద్ధాలు వద్దని కోరారు. సౌదీ అరేబియాలో మాట్లాడుతూ తనను తాను శాంతికర్తగా అభివర్ణించుకున్న
ట్రంప్.. రెండు అణ్వాయుధ దేశాల మధ్య ఉద్రిక్తతలను తగ్గించడానికి ప్రయత్నించినట్లు చెప్పారు. యూఎస్-సౌదీ ఇన్వెస్ట్మెంట్ ఫోరమ్లో ట్రంప్ మాట్లాడారు. ఈ కార్యక్రమానికి సౌదీ యువరాజు మహమ్మద్
బిన్ సల్మాన్, టెస్లా సీఈవో ఎలాన్ మస్క్,, అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో తదితరులు హాజరయ్యారు. భారత్-పాకిస్థాన్ మధ్య అణుయుద్ధం నివారించడానికి తన మధ్యవర్తిత్వం సహాయపడిందని మరోసారి
ట్రంప్ వెల్లడించారు. ఇది లక్షలాది ప్రాణాలను కాపాడిందని పేర్కొన్నారు. ఉద్రిక్తతలు మరింత తగ్గేందుకు.. భారత్, పాకిస్థాన్ దేశాలు మంచి డిన్నర్ ఏర్పాటుచేసుకోవాలని సూచించారు. ఇరుదేశాల మధ్య
శాంతి ప్రక్రియలో ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, విదేశాంగ శాఖ మంత్రి మార్కో రూబియోలు పాలుపంచుకున్నారని కొనియాడారు. ‘‘ఇరుదేశాల పరిస్థితి బాగుందని అనుకుంటున్నాను. వాళ్లని మనం ఒకచోట చేర్చవద్చు.
మార్కో రూబియో, వాళ్లు కలిసి బయటకు వెళ్లి మంచి విందు చేసుకోవచ్చు. ఇది బాగుంటుంది కదా?’’ అని ట్రంప్ వ్యాఖ్యానించారు. ‘‘కొన్ని రోజుల క్రితమే భారత్-పాకిస్థాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలను
తగ్గించడానికి చారిత్రక కాల్పుల విరమణ ఒప్పందాన్ని అమలుచేయడంలో మా యంత్రాంగం విజయవంతమైంది. ఈ విషయంలో నేను వాణిజ్య అంశాలను ఎక్కువగా ఉపయోగించాను’’ అని ట్రంప్ మరోసారి వెల్లడించారు. ‘‘సహచరులారా
రండి..ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుందాం..కొంత వ్యాపారం చేద్దాం’ అని వారికి నచ్చచెప్పాను. అణు క్షిపణుల వాణిజ్యం చేయొద్దు. అందరికీ ఆనందం కలిగేలా చేద్దాం. వారిద్దరూ(భారత్-పాక్ పాలకులు) గొప్ప,
శక్తిమంతమైన, ఉత్తమ, తెలివైన నేతలు. అంతా(యుద్ధం) నిలిచిపోయింది. అది అలాగే కొనసాగాలని ఆశిద్దాం’’ అంటూ ఎలాన్మస్క్ వంటి ఉన్నతస్థాయి ఆహూతుల కరతాళధ్వనుల మధ్య ట్రంప్ పేర్కొన్నారు. అయితే..
కాల్పుల విరమణ విషయంలో మూడోపక్ష మధ్యవర్తిత్వాన్ని భారత్ తిరస్కరించిన విషయం తెలిసిందే. భారత్, పాకిస్థాన్లకు చెందిన డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ (డీజీఎంఓ) తమంత తాముగా అవగాహనకు
వచ్చారని, ఈ వ్యవహారంలో మరెవరి ప్రమేయం లేదని భారత ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి.