Nadendla manohar: రేషన్ దుకాణాల ద్వారా నిత్యావసరాలు.. డీలర్లు సిద్ధం కావాలి: మంత్రి నాదెండ్ల

Play all audios:

విజయవాడ: ప్రజా పంపిణీ వ్యవస్థలో ఎలాంటి అవకతవకలకు ఆస్కారం లేకుండా ఉండేందుకు ప్రభుత్వం రేషన్ దుకాణాల ద్వారా సరకుల పంపిణీ చేపడుతుందని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు.
విజయవాడలో కలెక్టర్లు, పౌరసరఫరాలశాఖ అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. కూటమి ప్రభుత్వం నిర్ణయం మేరకు జూన్ 1 నుంచి డీలర్లు రేషన్ దుకాణాల ద్వారా నిత్యావసరాల పంపిణీకి సిద్ధం కావాలని
ఆదేశించారు. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వానికి మంచిపేరు తెచ్చేలా రేషన్ డీలర్లు పనిచేయాలని కోరారు. గతంలో కార్డుదారుల కుటుంబాలకు కుటుంబ పెద్దలా ఉన్న రేషన్ డీలర్లు
అదే విధంగా ఇప్పుడు కూడా మనసుపెట్టి పనిచేసి లబ్ధిదారులకు గౌరవంగా సేవలందించాలన్నారు. రేషన్ దుకాణాల పరిసరాలు శుభ్రంగా ఉండేలా చూడటం, సరైన తూకంతో సరకులు పంపిణీ చేయటం, ధరలు, స్టాక్ బోర్డ్,
పోస్టర్లు ఏర్పాటు చేసుకోవాలన్నారు. దివ్యాంగులు, 65 ఏళ్లు పైబడిన వృద్ధులకు ఇంటివద్దే రేషన్ సరకులు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. ప్రతినెల ఒకటో తేదీ నుంచి 15వ తేదీ వరకు ఆదివారాల్లో సైతం సరకుల
పంపిణీ పూర్తి చేయాలన్నారు. ఒకటో తేదీ నుంచి 5వ తేదీలోపే దివ్యాంగులు, వృద్ధులకు రేషన్ సరకులు పంపిణీ చేసేందుకు చొరవ చూపాలని మంత్రి సూచించారు. వాట్సప్ గ్రూపు ద్వారా ఎప్పటికప్పుడు సమాచారం
అందించడం వల్ల కార్డుదారులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడవచ్చన్నారు. ఒకవేళ ఎప్పుడైనా సాంకేతిక సమస్యలు ఎదురైనాసరే కార్డుదారులకు ఇబ్బందిలేకుండా ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా సరుకుల
పంపిణీ జరగాల్సిందేనని స్పష్టం చేశారు. ఈ-పోస్, వేయింగ్ మిషన్ల రిపేర్లకు సంబంధించి సర్వీసు క్యాంపులు ప్రతి జిల్లాలో ఏర్పాటు చేశామన్నారు.