Pak spy: జ్యోతి మల్హోత్రా గ్యాడ్జెట్లలో 12టెరా బైట్ల డేటా..

Play all audios:

ఇంటర్నెట్డెస్క్: పాకిస్థాన్ కోసం గూఢచర్యం చేస్తోందన్న ఆరోపణలపై అరెస్టయిన హరియాణా యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా (Jyoti Malhotra)కు సంబంధించి మరో విషయం వెలుగులోకి వచ్చింది. తనతో టచ్లో పాక్
అధికారులు ఇంటర్సర్వీస్ ఇంటెలిజెన్స్(ISI)తో కలిసి పనిచేస్తున్నారని జ్యోతికి తెలుసని దర్యాప్తుతో సంబంధం ఉన్న వర్గాలు వెల్లడించాయి. కానీ ఆమె భయపడకుండా ఆ సంప్రదింపులు కొనసాగించారని
పేర్కొన్నాయి. ఆమె ల్యాప్టాప్, ఫోన్లోని సమాచారం ఆధారంగా ఈ విషయాన్ని వెల్లడించాయి. (Pak spy). గూఢచర్యం ఆరోపణలపై అరెస్టయిన జ్యోతి ల్యాప్టాప్, ఫోన్ను స్వాధీనం చేసుకొని ఫోరెన్సిక్
విశ్లేషణకు పంపారు. వాటిల్లో అప్పటికే తొలగించిన సమాచారాన్ని అధికారులు రికవరీ చేశారని, అదంతా 12టెరాబైట్ల మేర ఉందని సమాచారం. ఈ కేసులో మరిన్ని ఆధారాల కోసం ఆ డేటాను స్కాన్ చేస్తున్నారు. తాను
ఐఎస్ఐకు సంబంధించిన వ్యక్తులతో మాట్లాడుతున్నానని తెలిసే, కాంటాక్ట్ కొనసాగించారని ఆ సమాచారం ఆధారంగా ప్రాథమికంగా గుర్తించారు. జ్యోతి నలుగురు పాక్ ఐఎస్ఐ ఏజెంట్లతో నేరుగా మాట్లాడిందని, వారిలో
డానిష్, అహ్సాన్, షాహిద్ ఉన్నారని ఆ వర్గాలు వెల్లడించాయి. ఐఎస్ఐలో ఆ ఏజెంట్ల హోదాలు, ఉద్యోగాలు ఏంటో ధ్రువీకరించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక..జ్యోతి మల్హోత్రాకు పాక్లో ఆరుగురు వ్యక్తులు
ఏకే 47లతో భద్రత కల్పించిన దృశ్యాలు వైరల్ అయ్యాయి. వారు ధరించిన జాకెట్లపై ‘‘నో ఫియర్’’ అని రాసి ఉన్నట్లు కనిపించింది. ఇక, 2023లో వీసా కోసం పాక్ హైకమిషన్కు వెళ్లిన సమయంలో తొలిసారి డానిష్
పరిచయం అయ్యాడని వెల్లడించింది. పాక్ హైకమిషన్ కార్యాలయానికి వీసా కోసం వచ్చే వారిని ట్రాప్ చేసి వారిని డానిష్ గూఢచర్యానికి వాడుకొనేవాడని.. యూట్యూబర్ జ్యోతి కూడా వీసా కోసం వెళ్లగా ఆమెను
ట్రాప్ చేశాడని అధికారిక వర్గాలు పేర్కొన్నాయి. ఇంతకాలం పోలీస్ రిమాండ్లో ఉన్న జ్యోతిని కోర్టు నిన్న 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీకి పంపింది. పాకిస్థాన్తో సంబంధం ఉన్న గూఢచర్య నెట్వర్క్ (Spy
Network)పై అధికారులు ఉక్కుపాదం మోపుతున్న సంగతి తెలిసిందే. కొన్ని వారాల వ్యవధిలో యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా సహా 10 మందికిపైగా అరెస్టయిన సంగతి తెలిసిందే. పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్
నేపథ్యంలో ఈమేరకు చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.