నాకెందుకు ఈ పరీక్ష స్వామీ.. మంచు విష్ణు పోస్ట్ వైరల్

Play all audios:

ఇంటర్నెట్డెస్క్: మంచు విష్ణు (Manchu Vishnu) కీలక పాత్రలో నటించిన తాజా చిత్రం ‘కన్నప్ప’ (Kannappa). ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ జూన్ 27 (kannappa release date) ప్రేక్షకుల
ముందుకు రానుంది. ఈ క్రమంలో మరో సమస్య ‘కన్నప్ప’ను చుట్టుముట్టింది. ఈ మూవీలో కీలక సన్నివేశాలకు సంబంధించిన హార్డ్డ్రైవ్ను అనుమతి లేకుండా బయటకు తీసుకెళ్లడం సర్వత్ర చర్చనీయాంశమైంది. ఈ ఘటనపై
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇప్పటికే మూవీ ప్రచార కార్యక్రమంలో తీరిక లేకుండా గడుపుతున్న మంచు విష్ణుకు ఈ సమస్య కొత్త తలనొప్పి తెచ్చిపెట్టింది. దీంతో ఆ పరమ శివుడిని
ప్రశ్నిస్తూ మంచు విష్ణు పోస్ట్ పెట్టారు. ‘జటాజూటధారీ, నీకోసం తపస్సు చేసే నాకెందుకు ఈ పరీక్ష స్వామీ?’ #హరహరమహదేవ్ అంటూ ఎక్స్ వేదికగా ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో మంచు విష్ణుకు ఎదురైన
పరిస్థితి చూసి, ఆయన అభిమానులు ఎక్స్ వేదికగా ధైర్యం చెబుతున్నారు. ఇదీ జరిగింది.. కోకాపేటకు చెందిన రెడ్డి విజయ్కుమార్ ట్వంటీ ఫోర్ ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ ప్రైవేట్ లిమిటెడ్కు ఎగ్జిక్యూటివ్
ప్రొడ్యూసర్గా ఉన్నారు. కన్నప్ప చిత్రానికి కీలకమైన కంటెంట్ ఉన్న హార్డ్డ్రైవ్ను ముంబయిలోని హెచ్ఐవీఈ స్టూడియోస్ వారు డీటీడీసీ కొరియర్ ద్వారా ఫిల్మ్నగర్లోని విజయ్కుమార్ కార్యాలయానికి
పంపారు. ఈ పార్శిల్ను ఈ నెల 25న ఆఫీస్బాయ్ రఘు తీసుకున్నాడు. అతను ఈ విషయం ఎవరికీ చెప్పకుండా హార్డ్డ్రైవ్ను చరిత అనే మహిళకు అప్పగించాడు. అప్పటి నుంచి వారు తప్పించుకుని తిరుగుతున్నారు. తమ
ప్రాజెక్టుకు నష్టం కలిగించాలనే దురుద్దేశంతో రఘు, చరితలు కలిసి ఇలా చేస్తున్నారని విజయ్కుమార్ ఫిల్మ్నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. హార్డ్ డిస్క్లో 1.30 గంటల సినిమా ఉందని ఫిర్యాదులో
పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. ముఖ్యంగా ప్రభాస్కు సంబంధించిన కీలక యాక్షన్ సీక్వెన్స్ హార్డ్డ్రైవ్లో ఉన్నట్లు టాలీవుడ్లో టాక్
వినిపిస్తోంది. ముకేశ్ కుమార్ సింగ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని మోహన్బాబు నిర్మిస్తున్నారు.