Sai sudharsan - ipl 2025: 12 మ్యాచ్లు.. 617 పరుగులు.. కొరకరాని కొయ్య ఈ సాయి సుదర్శన్

Play all audios:

> _ఐపీఎల్ (IPL)లో ఎంతోమంది > అంతర్జాతీయ సూపర్ > స్టార్లున్నారు. కానీ, > వాళ్లందరినీ వెనక్కి > నెట్టి దేశవాళీ ఆటగాడు > సాయి సుదర్శన్ (SAI SUDHARSAN) > అత్యధిక పరుగుల
వీరుడిగా > కొనసాగుతున్నాడు. విరాట్ > కోహ్లి సహా చాలామంది > స్టార్ బ్యాటర్ల నుంచి > గట్టి పోటీ ఎదురవుతున్నా.. > సుదర్శన్ తగ్గట్లేదు. > కొరకరాని కొయ్యలా ఎవరికీ > సాధ్యం
కాని నిలకడతో > దూసుకెళ్తున్నాడు._ తమిళనాడుకి చెందిన సాయి సుదర్శన్ ఇప్పటిదాకా ఆడిన ఐపీఎల్ మ్యాచ్లు 37. వాటిలో 27 మ్యాచ్ల్లో 30 ప్లస్ స్కోర్లు చేయడం విశేషం. ఐపీఎల్ చరిత్రలో మరే ఆటగాడికీ
సాధ్యం కాని ఘనత ఇది. అతనెంత నిలకడగా ఆడుతున్నాడో చెప్పడానికి ఈ ఒక్క గణాంకం చాలు. టీ20 క్రికెట్లో అత్యంత వేగంగా 2 వేల పరుగుల మైలురాయిని అందుకున్న భారత బ్యాటర్గా అతను ఇటీవలే రికార్డు
నెలకొల్పాడు. అతడికిది 54వ ఇన్నింగ్స్ మాత్రమే. అంతర్జాతీయ క్రికెట్లో ఒక్క షాన్ మార్ష్ (54 ఇన్నింగ్స్లు) అతడి కంటే ముందున్నాడు. ఐపీఎల్లో సాయి సుదర్శన్ గణాంకాలు చూస్తే నమ్మశక్యం కానట్లుగా
ఉంటాయి. 37 ఐపీఎల్ మ్యాచ్ల్లో అతను 50.03 సగటుతో 1651 పరుగులు సాధించాడు. అందులో రెండు శతకాలు, 11 అర్ధశతకాలున్నాయి. ఐపీఎల్ పునః ప్రారంభం తర్వాత ఆడిన తొలి మ్యాచ్లోనే అతను అజేయ శతకం సాధించాడు.
ఆదివారం దిల్లీపై ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చి 61 బంతుల్లోనే 108 పరుగుల అజేయ ఇన్నింగ్స్తో జట్టును గెలిపించాడు. అతడి ధాటికి 200 పరుగుల లక్ష్యం తేలికైపోయింది. సుదర్శన్ ఆట చూస్తే నెమ్మదిగా
సాగుతున్నట్లు అనిపిస్తుంది కానీ... తన స్ట్రైక్ రేట్ 145కు పైనే కావడం విశేషం. ఈ ఎడమ చేతి వాటం బ్యాటర్ ఇప్పటిదాకా 163 ఫోర్లు, 51 సిక్సర్లు బాదాడు. ప్రస్తుత సీజన్లో సుదర్శన్ 12 మ్యాచ్ల్లో
56కు పైగా సగటుతో 617 పరుగులు సాధించిన టాప్ స్కోరర్గా కొనసాగుతుండడం విశేషం. 2022లో ఐపీఎల్లోకి అడుగు పెట్టిన తొలి సీజన్లో గుజరాత్ టైటాన్స్ సుదర్శన్ను ఎంచుకుంది. కానీ, మొదట్లో అతడికి తుది
జట్టులో అవకాశాలు రాలేదు. సీజన్ మధ్యలో ఛాన్స్ ఇస్తే బాగా ఉపయోగించుకున్నాడు. 5 మ్యాచ్ల్లో 145 పరుగులతో జట్టు కప్పు గెలవడంలో తన వంతు పాత్ర పోషించాడు. దీంతో తర్వాతి సీజన్ నుంచి గుజరాత్ అతణ్ని
రెగ్యులర్గా తుది జట్టులో ఆడిస్తోంది. శుభ్మన్ గిల్ లాంటి మేటి బ్యాటర్కు సుదర్శన్ లాంటి నిలకడైన ఆటగాడు తోడవడంతో ఐపీఎల్లోనే బెస్ట్ ఓపెనింగ్ జోడీ గుజరాత్దే అయింది. ఈ సీజన్లో గుజరాత్
దూసుకెళ్తుండడానికి ఈ జోడీనే ప్రధాన కారణం. ఇద్దరూ పోటీ పడి పరుగులు సాధిస్తూ జట్టుకు శుభారంభాలందిస్తున్నారు. మూడో స్థానంలో ఆడే జోస్ బట్లర్ కూడా నిలకడగా రాణిస్తుండడంతో గుజరాత్ పని
తేలికైపోతోంది. మిడిలార్డర్కు పెద్దగా పనే ఉండట్లేదు. సన్రైజర్స్తో మ్యాచ్లోనూ సుదర్శన్ 48 పరుగుల మెరుపు ఇన్నింగ్స్తో జట్టుకు శుభారంభాన్నిచ్చాడు. సుదర్శన్ టీ20 క్రికెట్కు అవసరమైన దూకుడును
ప్రదర్శిస్తాడు కానీ.. చాలామంది కుర్రాళ్ల లాగా అడ్డదిడ్డంగా షాట్లు ఆడడు. ఎక్కువగా గ్రౌండ్ షాట్లకే ప్రాధాన్యమిస్తాడు. గాల్లోకి బంతి లేపాడంటే గ్యాప్లో అయినా వెళ్లాలి. లేదా స్టాండ్స్లో అయినా
పడాలి. వికెట్కు ఎంతో విలువ ఇస్తూ నిలకడగా పరుగులు సాధిస్తూ లీగ్లో మేటి బ్యాటర్లలో ఒకడిగా ఎదుగుతున్నాడు. పిలుపు రాబోతోందా? సుదర్శన్ ఆట సునీల్ గావస్కర్, రవిశాస్త్రి లాంటి మాజీలు చాలామందిని
ఆకట్టుకుంది. అతణ్ని టీమ్ ఇండియాలోకి తీసుకోవాలన్న డిమాండ్లు గట్టిగా వినిపిస్తున్నాయి. మెరుగైన టెక్నిక్ ఉన్న సుదర్శన్.. అవసరమైనప్పుడు దూకుడుగానూ ఆడగలడు. సుదీర్ఘ ఇన్నింగ్స్లు ఆడగల నైపుణ్యం
ఉందతడికి. సుదర్శన్ మూడు ఫార్మాట్లకూ సరిపోయే ఆటగాడని రవిశాస్త్రి కితాబిచ్చాడు. ఐపీఎల్ తర్వాత ఇంగ్లాండ్ పర్యటనకు అతణ్ని ఎంపిక చేయాలని అతను సూచించాడు. ‘‘సుదర్శన్ ఒక క్లాస్ ప్లేయర్. అతడికి మూడు
ఫార్మాట్లలోనూ ఆడగలిగే సత్తా ఉంది. ఎడమచేతి వాటం బ్యాటర్ కావడం, మెరుగైన టెక్నిక్ ఉండడం సుదర్శన్ను ఇంగ్లాండ్తో సిరీస్ రేసులోకి తీసుకొచ్చాయి’’ అని రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. ఐపీఎల్లో ఓ
మోస్తరు ప్రదర్శన చేసిన కుర్రాళ్లకు కూడా టీమ్ ఇండియాలో అవకాశాలు వచ్చాయి. అలాంటిది సుదర్శన్ ఇంత నిలకడగా రాణించాక అతడికి ఛాన్సివ్వక తప్పదు. అతను ఇప్పటికే టీమ్ ఇండియాలోకి రావాల్సిందనే
అభిప్రాయాలున్నాయి. అతను వచ్చే నెల తొలి వారంలో ఇంగ్లాండ్ లయన్స్తో నాలుగు రోజుల మ్యాచ్లో భారత్-ఎ తరఫున ఆడబోతున్నాడు. ఆ తర్వాత అతడికి ఇంగ్లాండ్తో టెస్టు సిరీస్ ఆడే భారత జట్టులోనూ చోటు
దక్కడం లాంఛనమే కావచ్చు. _- ఈనాడు క్రీడావిభాగం_