Jyoti malhotra: జ్యోతి మల్హోత్రా పూరీకి ఎందుకొచ్చింది? ఆ యూట్యూబర్తో సంబంధమేంటీ? : పోలీసుల ఆరా

Play all audios:

భువనేశ్వర్: పాకిస్థాన్ నిఘా సంస్థలకు భారత్ (India)కు చెందిన సున్నితమైన సమాచారాన్ని చేరవేస్తున్నారన్న ఆరోపణలపై యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఆమెకు
పూరీకి చెందిన మరో యూట్యూబర్తో ఉన్న సంబంధంపై ఒడిశా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. హరియాణాలోని హిస్సార్కు చెందిన జ్యోతి మల్హోత్రా గతేడాది సెప్టెంబర్లో పూరీ సందర్శించారని, అక్కడ మరో మహిళా
యూట్యూబర్ను కలిసినట్లు గుర్తించామని ఒడిశాలోని పూరీ ఎస్పీ వినీత్ అగర్వాల్ వెల్లడించారు. పూరీకి చెందిన సదరు యూట్యూబర్ ఇటీవల పాకిస్థాన్లోని కర్తార్పుర్ సాహిబ్ గురుద్వారాను
సందర్శించినట్లు ఆయన తెలిపారు. అసలు ఆమె పూరీకి ఎందుకొచ్చింది? ఈ మేరకు ఆదివారం ఎస్పీ వినీత్ అగర్వాల్ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘జ్యోతి మల్హోత్రా గతేడాది పూరీ సందర్శించినట్లు మేం గుర్తించాం.
వాస్తవాలు ఏంటనేది వెరిఫై చేస్తున్నాం. ధ్రువీకరించుకున్నాక మరిన్ని వివరాలను వెల్లడిస్తాం’’ అన్నారు. అయితే, జ్యోతి మల్హోత్రాతో పూరీకి చెందిన మహిళ ఇంటెలిజెన్స్ సమాచారాన్ని పంచుకుందా అని
అడగ్గా.. ఈ కేసును హరియాణా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని, వారికి అవసరమైన సహకారం అందిస్తున్నట్లు తెలిపారు. అసలు జ్యోతి మల్హోత్రా పూరీ సందర్శన వెనుక ఉన్న ఉద్దేశం ఏమిటనే కోణంలో దర్యాప్తు
చేస్తున్నారు. ఆ సమయంలో ఆమె ఎక్కడ ఉంది? ఎవరిని కాంటాక్టు అయ్యింది? ఏవైనా అనుమానాస్పద కార్యకలాపాలు ఉన్నాయా? అనే విషయాలు తెలుసుకొనేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఎస్పీ వెల్లడించారు. పలు కేంద్ర
దర్యాప్తు సంస్థలు, హరియాణా పోలీసులతో టచ్లో ఉన్నట్లు వెల్లడించారు. అయితే, పూరీకి చెందిన ఆ యూట్యూబర్ గుర్తింపునకు సంబంధించిన వివరాలు మాత్రం పోలీసులు అధికారికంగా వెల్లడించలేదు. పోలీసులకు
పూర్తిగా సహకరిస్తాం: పూరీ యూట్యూబర్ తండ్రి ఈ అంశంపై పూరీకి చెందిన యూట్యూబర్ తండ్రి మాట్లాడుతూ.. పోలీసులు శనివారం తన కుమార్తెను విచారించి కొంత సమాచారం సేకరించినట్లు వెల్లడించారు. ‘‘ఇద్దరూ
యూట్యూబర్లు గనక నా కుమార్తెకు జ్యోతి మల్హోత్రాతో పరిచయం ఏర్పడింది. వారి మధ్య స్నేహం పెరగడంతో జ్యోతి మల్హోత్రా పూరీని సందర్శించింది. ఇది దేశ భద్రతకు సంబంధించిన వ్యవహారం గనక సరైన దర్యాప్తు
జరగాలి. పోలీసులకు మేం సహకరిస్తాం. మా అమ్మాయి మూడు నాలుగు నెలల క్రితం తీర్థయాత్రలో భాగంగా పాకిస్థాన్లోని కర్తార్పుర్ వెళ్లింది. కానీ, మల్హోత్రాతో కాదు.. మరో ఫ్రెండ్తో కలిసి అక్కడికి
వెళ్లింది. ఆమె దేశ వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొనలేదు. మల్హోత్రా గూఢచర్యం చేస్తున్నారనే ఆరోపణ గురించి ఆమెకు తెలియదు’’ అని తెలిపారు. ఆమె ‘గూఢచర్యం’ గురించి నాకు తెలియదు: పూరీ యూట్యూబర్
మరోవైపు, ఈ అంశంపై పూరీ యూట్యూబర్ ఇన్స్టా వేదికగా స్పందించారు. ‘జ్యోతి మల్హోత్రా నాకు ఫ్రెండ్ మాత్రమే. నేను ఆమెను యూట్యూబ్ ద్వారా కలిశాను. ఆమెపై ఆరోపణలు ఉన్న విషయం నాకు తెలియదు. ఆమె
శత్రు దేశం పాక్ కోసం గూఢచర్యం చేస్తుందని తెలిస్తే.. నేను ఆమెతో కాంటాక్ట్లో ఉండేదాన్ని కాదు. ఏదైనా దర్యాప్తు సంస్థ నన్ను ప్రశ్నించాలనుకుంటే, నేను పూర్తి సహకరిస్తాను. అన్నింటికంటే దేశం
గొప్పది. జైహింద్’’ అని పోస్టులో పేర్కొన్నారు.